Rapid TV - Andhra Pradesh / Anakapally : RAPID TV నర్సీపట్నం : నర్సీపట్నం ఆర్టీసీ డిపోలో ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు డిపో యాజమాన్యం తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని గౌరవ స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆదేశించారు. నర్సీపట్నం డిపో నుంచి హైదరాబాద్తో పాటు కాకినాడకు ఏర్పాటు చేసిన రెండో సర్వీసును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత పరిస్థితుల్లో నర్సీపట్నం నుండి హైదరాబాద్కు ప్రత్యేక సర్వీసు ప్రారంభించడం శుభపరిణామమని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ఆకస్మికంగా ఆర్టీసీ కాంప్లెక్స్ పరిసరాలను పరిశీలించిన స్పీకర్ రోజూ వేలాది మంది ప్రయాణించే నర్సీపట్నం డిపోలో సౌకర్యాల విషయంలో పెనుభారముందని అసంతృప్తి వ్యక్తం చేశారు. మరుగుదొడ్ల నిర్వహణ సక్రమంగా లేకపోవడం, డిపో భవనాల రంగులు పాడవడం వంటి అంశాలపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి నెల డిపోకు అద్దె రూపేణా వచ్చే రూ.7.90 లక్షల ఆదాయాన్ని వినియోగించి ఈ పనులన్నీ తక్షణమే పూర్తి చేయాలని ఆయన సూచించారు. అదేవిధంగా, డిపో ఆవరణలో ఉన్న పిచ్చిమొక్కలను తొలగించి, పరిసరాలను శుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. ఇలాంటి సమస్యలపై సమీక్ష నిర్వహించి, తగిన చర్యలు తీసుకునేలా రీజినల్ చైర్మన్ దొన్నుదొర కృషి చేయాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు సూచించారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ చింతకాయల రాజేష్, వెలమ సంఘం డైరెక్టర్ సూర్యచంద్ర, అనకాపల్లి డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ ఆఫీసర్ కే పద్మావతి, నర్సీపట్నం డిపో మేనేజర్ ఎం.ఎస్.ఎస్. ధీరజ్, మున్సిపాలిటీ కౌన్సిలర్లు, వార్డు ఇంచార్జ్ లు పాల్గొన్నారు.
Reporter
Rapid TV